Skip to main content

దేశంలో బ్లాక్ మనీ, ఉగ్రవాద నిర్మూలన, అక్రమ లావాదేవీలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనా ? .

పెద్దనోట్లు రద్దు చేసి నేటికి (నవంబర్ 8) సంవత్సరం పూర్తి అయ్యింది. ఈ సందర్బంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదే అంటున్నారు కొంతమంది ప్రజలు.  దారుణమైన తప్పని,మరికొంతమంది ముఖ్యంగా కాంగ్రెస్-వామపక్ష వాదులు అంటున్నారు . 
పెద్దనోట్లు రద్దు అయిన తరువాత దేశంలో ఉగ్రవాదం, నక్సల్ కార్యకలాపాలు చాల వరకూ తగ్గిపోయాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి . 
కరెన్సీ కష్టాలు స్వల్పకాలమే ఉన్నాయని, కానీ దీర్ఘకాలంలో దీని వల్ల మేలు జరుగుతుందని బ్యాంకులు, నిపుణులు చెబుతున్నారు. 
స్థిరాస్తుల రేట్లు దారుణంగా పడిపోవడం, దేశ జాతీయ ఉత్పత్తి తగ్గి, దేశం ఆర్ధిక మాంద్యములోకి జారిపోవడం తదితర కష్టాలకు కారణం ప్రభుత్వం యొక్క  దారుణమైన తప్పిదమే ! అని ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయ్ 
నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వడానికే పెద్ద నోట్లను రద్దు చేశారని, ఇదొక పెద్ద కుంభకోణమని మరో ఆరోపణ!
నోట్ల రద్దు లక్ష్యం,  నల్లధనాన్ని నిర్మూలించి, అవినీతిని తగ్గించడానికి ఉద్దేశించినదని, ఈ లక్ష్యం చాలా వరకూ నెరవేరిందని చెబుతూ, నగదూ, జీడీపీ నిష్పత్తి 12.4 శాతం నుంచి 10.8 శాతానికి తగ్గిందని, క్రమంగా డిజిటల్ ఎకానమీ దిశగా పురోగమిస్తున్నామని  మరో ఆర్థికవేత్త అభిప్రాయం .
 ఏది నిజం? ఏది అబద్దం?  
 మనదేశంలో నోట్ల ఉపసంహరణ పై ,నల్లధనం అదుపు చేయడం పై , ఈ మధ్యనే చేసిన 
ఒక సర్వేలో ... 
నోట్ల ఉపసంహరణ,తన  లక్ష్యాన్ని అందుకోవడంలో  విజయవంతమైందని 55% ఒప్పుకొన్నారు. 
నోట్ల ఉపసంహరణ వలన ఆర్ధిక వ్యవస్థ కుదేలైనా ,పారదర్శకత పెరిగిందని 70% ప్రజలు చెప్పారు. 
నోట్ల ఉపసంహరణ వలన ఒకటి రెండు ఏళ్ళు  నిరుద్యోగ సమస్య  బాధిస్తుందని  70% అభిప్రాయం. (వ్యాపారాలు మందగించడం వలన సుమారు 15 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు . అంటే,పరోక్షంగా అరకోటి మంది భారతీయులు కష్టాల పాలయ్యారు. 
అంతేకాదు,కేంద్రం 30 లక్షలమంది యువకులకు నైపుణ్య శిక్షణ ఇస్తే,వారిలో కేవలం 3లక్షలమందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు దక్కాయి) . 
నోట్ల ఉపసంహరణ వెనుక  మోడీ కి ఉన్న ముఖ్యమైన కారణం నల్లధనం భరతం పట్టడమే " అని 70% నమ్ముతున్నారు . 
 నోట్ల ఉపసంహరణ వలన ప్రభుత్వం యెక్క ఇమేజ్ పెరిగిందని 55% అభిప్రాయ పడ్డారు .  

పెద్దనోట్ల రద్దు, జి.ఎస్.టి , రేరా చట్టం వలన,రియల్ ఎస్టేట్ సెక్టార్ లో ,ముఖ్యంగా ఎక్కడైతే నగదు లావాదేవీలుంటాయో,అనగా విలాసవంతమైన ఫ్లాట్ లు, సెకండ్ హాండ్ ఫ్లాట్ లు, అలాగే స్పెక్యులేషన్ తో కూడిన స్థలాలు,పొలాల  అమ్మకాలు బాగా పడిపోయాయి. నగదుతో పనిలేని,బాంక్ లోన్ లపై ఆధారపడే  మధ్యతరగతి ఫ్లాట్ ల అమ్మకాలు బాగానే ఉన్నాయి . 
ఒక చిన్న పిట్ట కధ ... 
నాకు తెలిసిన ఒక చిన్న వ్యాపారి ఎప్పటి నుండో చిన్న స్థలం కొనాలని కల లు గంటున్నాడు . కానీ, అవినీతి జలగలైన ఉద్యోగులతో   , నల్లధనం కుప్పతెప్పలుగా ఉన్న బడా వ్యాపారుల తో పోటీ పడలేక , అతని కల ,కలగానే ఉండిపోయింది .  ఎందుకంటే నల్లధనం ఉన్నవారు ఎంత రేటు పెట్టైనా కొనగలరు . వారివలనే గదా, దేశంలో రియల్ ఎస్టేట్ ,బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి . ఎప్పుడైతే, పెద్దనోట్ల రద్దు జరిగిందో సీన్ రివర్స్ అయింది . ధరలు అందుబాటులోకి దిగివచ్చాయి . అవసరం ఉన్నవారే కొంటున్నారు తప్ప నలుపు ని తెలుపు గా మార్చేవాళ్ళు తగ్గిపోవడంతో రియల్ ఎస్టేట్ ధరలు దిగివచ్చాయి . చిన్న వ్యాపారి కల ఇన్నాళ్లకు తీరింది . 

ఒక ఆర్ధిక నిపుణుడు  ఇలా అంటున్నారు, …” ఇది ఆర్ధిక మాంద్యమా?  లేక దొంగ లావాదేవీల మాంద్యమా??  దేశ జాతీయ ఉత్పత్తి తగ్గిందా? లేక హవాలా సేవారంగ ఉత్పత్తి తగ్గిందా?
అన్నీ తగ్గుతాయి . మోసాలు,హవాలాలు,నల్లధనపు రెపరెపలు ఎందుకుతగ్గవు ?  దొంగ లదోపిడీ లెక్కవుండే సేవారంగం ఎప్పుడైతే మందగించిందో , దేశ ఉత్పత్తి విలువలు తగ్గడంలో ఆశ్చర్యమేముంది ?

 వ్యవసాయ,పారిశ్రామిక రంగం వలన ఆర్ధిక మాంద్యం రావడానికి నేడు అవకాశాలు తక్కువ . ఎందుకంటే GDP లో వీటి వాటా ఏటికేడు తగ్గిపోతుంది . నోట్లరద్దు వలన ఈ రెండు రంగాలు  ప్రత్యక్షంగా దెబ్బతినవు . వాతావరణం, చీడపీడలు, విద్యుత్ ఉత్పత్తి,ఋతు పవనాలు , ప్రజలవినియోగశక్తి  ఈ రెండురంగాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి .  కానీ సేవారంగం  అనేది వ్యాపారాలు , వస్తు-సేవల వినియోగం , కరెన్సీ లావాదేవీలు ,ప్రజల కొనుగోలుశక్తి తదితర విషయాలపై ఆధారపడి ఉంటుంది . సేవారంగానికి ప్రాణం కరెన్సీ లావాదేవీలే! ఎప్పుడైతే కరెన్సీ ప్రవాహానికి అడ్డుకట్ట పడిందో దాని  యొక్క ప్రభావం సేవారంగం పైన,తద్వారా ఆర్ధిక వ్యవస్థపైన  ఎక్కువ ఉంటుంది . 

“ప్రస్తుత దేశీయ స్థూల జాతీయోత్పత్తి రూ.130 లక్షల కోట్లుగా ఉంది. వృద్ధి రేటు ఒక శాతం తగ్గడం ద్వారా రూ.1.30 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని అంటున్నారు. అన్నీ చూస్తే నోట్ల రద్దుతో రూ.2 లక్షల కోట్ల పైనే నష్టపోయినట్లుగా అంచనా వేస్తున్నారు” మరికొందరు ఆర్థికవేత్తలు .

మరి మాజీ ప్రధానమంత్రిగారు నోట్లరద్దు'చేయడాన్ని వ్యవస్థీకృత దోపిడీ అని అంటున్నారెందుకు?

దోపిడీ దగ్గరుండి చేయించిన వాళ్ళే దోపిడీ దోపిడీ అని అరవడం నేడు  మామూలై పోయింది .  
దేశంలో ఏ కుంభకోణం వెలుగు చూసినా అందులో  కాంగ్రెస్ నేతల పేర్లు ,కాంగ్రెస్ మిత్రులపేర్లు  బయటపడటం చూస్తూ కూడా ,ఆర్ధిక సంస్కరణ లను అమలుచేస్తున్న ప్రభుత్వాన్ని పట్టుకొని వ్యవస్థీకృత దోపిడీ"అని అరవడం కేవలం దోపిడీదొంగలకే చెల్లింది .  అవినీతి పరుల కంటికి అందరు అవినీతి పరులు లాగా నే కనిస్పిస్తారు.   
తన ప్రభుత్వ హయాంలో 2జీ స్కాం, కామన్‌వెల్త్‌ క్రీడలు, కోల్ స్కాం తదితర స్కామ్ లపై ఏనాడూ పెదవి విప్పని మౌన స్వామి, నేడు గొంతు విప్పాడంటేనే అర్ధం అవుతుంది  ఆయన నిజాయితీ లో నిజమెంతో !
ఆర్ధిక సంస్కరణలు అవసరమా?
సంస్కరణ అంటేనే అగ్ని లా దహించి శుద్ధిచేసేది . "పెద్ద నోట్లరద్దు" ,"ఒకదేశం -ఒకటిపన్ను" అనే సంస్కరణల వలన మోడీ ప్రభుత్వానికి గానీ,మోడీ కాబినెట్లోని మంత్రులకు గానీ  ఒరిగేదేమీ ఉండదు . నల్లధనం తో మసకబారి,ఆర్ధిక అసమానతల తుఫాన్ తో అల్లాడుతూ దారిద్ర సముద్రాన్ని ఈదుతున్న పేదవారి తో కునారిల్లుతున్న దేశఆర్ధిక వ్యవస్థకు జవజీవాలను, పారదర్శకతను, నీతి నిజాయితీల ను  ఇచ్చే సదుదేశ్యంతో  ప్రవేశపెట్టిన సంస్కరణల వలన తొలి నాళ్లలో  దేశ ఆర్ధిక వ్యవస్థ నెమ్మదించింది. 
రెండునెలల పాటు పేదవారు కష్టాల పాలయ్యారు, చిన్న చిన్న వ్యాపారాలు చతికిల బడ్డాయి. కిరాణాషాపులు,అంగళ్ళు,తోపుడు బళ్ళలో వ్యాపారం చేసేవారు నగదు కొరత వలన తీవ్రమైన ఇబ్బందులు  పడ్డారు . ప్రజల వద్ద అప్పటికే ఉన్న పెద్దనోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసేందుకు 50 రోజులు గడువు ఇవ్వడంతో... వాటిని డిపాజిట్ చేసేందుకు, నోట్లు మార్చుకునేందుకు, చిల్లర మార్చుకునేందుకు సామాన్య  ప్రజలు నానా యాతన పడ్డారు .నోట్ల రద్దుతో దేశ జీడీపీ పడిపోయింది. వేలమంది ఉపాధి కోల్పోయారు. మంచి ఉద్దేశ్యంతో చేసిన సంస్కరణల వలన ఇబ్బందులు రావడం శోచనీయమే! కాదని ఎవరంటారు ?
గణాంకాలు ఏమి చెబుతున్నాయి?
నోట్ల రద్దు ప్రకటన నాటికి దేశంలో రూ.17.50 లక్షల కోట్లు చలామణిలో ఉంది. అందులో రూ.500, రూ.1000 నోట్లు రూ.15.44 లక్షల కోట్లు. అంటే అప్పటికి చలామణిలో ఉన్న నగదులో 86 శాతం ఈ పెద్దనోట్లదే. ఇందులో 2017 జూన్ 30 నాటికి బ్యాంకుల్లో రూ.15.28 లక్షల కోట్లు డిపాజిట్ అయింది. బ్యాంకులకు చేరనిది రూ.16,000 కోట్లు. నోట్ల ముద్రణకు 2014-15లో రూ.3762 కోట్లు, 2015-16లో రూ.3421 కోట్లు, 2016-17లో రూ.7965 కోట్లు అయ్యాయి.
 
సంస్కరణల వలన లాభమేమిటి?
నగదురహిత లావాదేవీలు,బినామీ లావాదేవీలు,హవాలా లావాదేవీలు, షెల్ కంపెనీల  లావాదేవీలు , టెర్రరిజం,మావోయిజం తదితర ఉగ్రవాదముఠాలకు సరఫరా అయ్యే నకిలీనోట్లు,నల్లధనం లావాదేవీలు , వ్యభిచారం,ఆడపిల్లల అమ్మకం తదితర నీతిబాహ్యమైన పనులకు కావలసిన కరెన్సీ  లావాదేవీలు, నకిలీ కరెన్సీ నోట్లవలన,నకిలీ ధనంద్వారా ఏర్పరచుకొన్న ఆస్థులు,షేర్ లు,బంగారం వలన ఏర్పడిన  సమాంతర ఆర్ధిక వ్యవస్థ లావాదేవీలను అదుపుచేయడానికి తీసుకోవలసిన ముఖ్య సంస్కరణలలో నోట్లరద్దు అనేది ఒకటి !

షెల్ల కంపెనీ ల ద్వారా విదేశాలకు నల్ల నగదుపంపి ,తిరిగి పార్టీసి పేటరీ నోట్ మరియు ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ద్వారా ఈ షెల్ కంపెనీలలో పెట్టుబడి పెట్టి తద్వారా ఇండియాలోకి ధనాన్ని తీసుకొచ్చే హవాలా లావాదేవీలకు అడ్డుకట్ట పడింది . మూడు లక్షలకు పైగా డొల్ల కంపెనీల అనుమానాస్పద లావాదేవీలపై నిఘా కొనసాగుతోంది. సుమారు 2  లక్షల డొల్ల కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. స్టాక్ ఎక్సేంజ్‌లో వందల కొద్ది కంపెనీల నమోదు రద్దయింది. ఇప్పటికి, 400కు పైగా బినామీ ఆస్తులను గుర్తించారు.
పన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చిన వారు 56 లక్షల మంది. ఆదాయపన్ను రిటర్న్‌లు దాఖలు 24.7 శాతం పెరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే వ్యక్తిగత ఆదాయపన్నులో ముందస్తు వసూళ్లు 41 శాతానికి పైగా పెరుగుదల కనిపించింది.

బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్లు రూ.3 లక్షల కోట్లకు పెరిగింది. వడ్డీ రేట్ల బేసిస్ పాయింట్లు తగ్గేందుకు ఇది ఉపయోగపడింది. 2016 అక్టోబర్ నాటికి 76.27 కోట్లుగా ఉన్న డిజిటల్ చెల్లింపులు 2017 మే నాటికి 111.45 కోట్లకు పెరిగింది. నోట్ల రద్దు తర్వాత కోటి మందికి పైగా కార్మికులు ఈపీఎఫ్, ఈఎస్ఐసీ వ్యవస్థలో చేరారు. వేతనాలు నేరుగా అకౌంట్లలో జారీ చేయడం కోసం బ్యాంకు ఖాతాలు తెరిచిన కార్మికులు 50 లక్షలమంది.
29 రాష్ట్రాల్లో రూ.11.23 కోట్ల విలువైన నకిలీ నోట్లు గుర్తించారు. జమ్ము కాశ్మీర్‌లో తీవ్రవాద దాడులు, రాళ్ల దాడులుతగ్గాయి. నక్సలైట్ల పైనా నోట్ల రద్దు ప్రభావం పడింది. హవాలా లావాదేవీలు సగానికి తగ్గాయి. పాకిస్తాన్‌లో ముద్రించిన నకిలీ నోట్ల మాఫియాకు ఎదురు దెబ్బ తగిలింది. రియల్ ఎస్టేట్ ధరలు తగ్గాయి. డిజిటల్ పేమెంట్లు పెరిగాయి. కానీ క్యాష్ లెస్ అనుకున్నంత వేగం పుంజుకోవడం లేదు. ఛార్జీలు భరించలేక వ్యాపారులు స్వైపింగ్ మిషన్లు వెనక్కి ఇస్తున్నారు.
వామపక్ష తీవ్రవాదం 20 శాతం తగ్గింది .  2.24 లక్షల షెల్ కంపెనీలను గుర్తించారు . 35 వేలకు పైగా కంపెనీలు 58 వేల బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 17 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు .

పరిశ్రమల తీరుతెన్నులు కూడా మారాయి . ఇదివరకు ఒక పెద్ద పరిశ్రమలో 10వేలమందికి  ఉద్యోగాలనిస్తే ,ఇపుడు అదే ఉత్పత్తిని చిన్న చిన్న పరిశ్రమలు తయారు చేయడం వలన లక్షమందికి ఉద్యోగాలు దొరికే వాతావరణం నేడు చూస్తున్నాం . 
మన ఆర్ధిక వ్యవస్థలో ,ఇన్ఫా ఫార్మల్ నుండి  ఫా ర్మల్ వ్యవస్థకు ప్రయాణం ప్రారంభమైంది. . బండి దారి మళ్లుతుంది . ఈ సమయంలో సహజంగానే  బండి వేగం తగ్గుతుంది .  
నోట్లరద్దుకి ముందు సుమారు 6లక్షలకోట్ల ధనం చెలామణీ లో లేకుండా ఇనప్పెట్టె ల్లో మగ్గుతూ ఉంది . లేక సమాంతర ఆర్ధిక వ్యవస్థ అనగా చట్టవ్యతిరేక కార్యక్రమాలలో పాలుపంచు కొంటూ ఉండేది . అలాంటి సొమ్ములన్నీ నేడు బాంక్ లలోకి వచ్చి పడ్డాయి . ఇలాంటి విజయాలు మరెన్నో రాబోతున్నాయి !
వ్యాపారులు ఇపుడు టాక్స్ లు కట్టడానికి ముందుకు వస్తున్నారు .
పూర్వం కంటే, సుమారు 30% ఎక్కువ మంది ఆదాయపన్ను కడుతున్నారు . 

అంటే ,ఎలాపడితే అలావుండే,పారదర్శకత లేని  ఆర్ధిక వ్యవస్థ వలన నల్లధన లావాదేవీలపై ప్రభుత్వానికి అదుపు ఉండదు . ఎప్పుడైతే,ఆర్ధిక లావాదేవీలను పారదర్శకం గా చేయవలసిన వ్యవస్థను నిర్మించామో , తొలిగా ఆర్ధిక మాంద్యం వచ్చినా , దీర్ఘకాలంలో పారదర్శకమైన, చురుకైన,  అసమానతలను తగ్గించే ఆర్ధిక వ్యవస్థ రూపుదిద్దు కొంటుంది . 
భారత ఆర్థిక వ్యవస్థను శుభ్రపర చ డానికి  ప్రజల సహకారం,త్యాగశీలత,ఓర్పు ఎంతో అవసరం . 
 స్వచ్ఛ భారత్ అంటే కేవలం టాయిలెట్ ల నిర్మాణం,పరిసరాల పరిశుభ్రత మాత్రమేకాదు, మన ఆర్ధిక లావాదేవీలలో కూడా శుద్ధత అత్యంత అవసరం! 

రద్దు చేసిన రూ.500, 1000 నోట్ల స్థానంలో రూ.500, 2000 నోట్లను తెచ్చిన నేపథ్యంలో,దీన్ని నోట్ల రద్దు అనడం కన్నా నోట్ల ఉపసంహరణ, కొత్త నోట్ల ప్రవేశం” అని చెప్పుకోవాలి. 

 నోట్ల రద్దు అనేది నిర్మాణాత్మక మార్పునకు ప్రారంభమే .. తదనంతర చర్యలు చాలా ఉండాలి ఉంటాయి కూడా !

Comments